ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి
posted on Sep 11, 2020 1:05PM
టీడీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో ఇటీవల ఆయన విజయవాడ జీజీహెచ్ లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం మరింత విషమించడంతో రామాంజనేయులు కన్నుమూశారు.
రామాంజనేయులు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ఛైర్మన్ గా రామాంజనేయులు వ్యవహరించారు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి మరణం విచారకరం అన్నారు చంద్రబాబు. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.