TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దల సభకు లెక్కల మాస్టారు భాష్యం రామకృష్ణ

Published on: Sun Jun 7, 2026 1:59PM

 

భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎనికపాడు ఆయన స్వగ్రమాం. సామాన్య రైతు కుటుంబంలో భాష్యం రామారావు, పేరమ్మ దంపతులకు 1969 మార్చి 1న రామకృష్ణ జన్మించారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి గుంటూరులోని ప్రైవేటు స్కూలులో లెక్కల మాస్టారిగా కెరీర్ ప్రారంభించిన ఆయన  1983 గుంటూరులోనే భాష్యం విద్యాసంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. 

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లోని వందకుపైగా  భాష్యం విద్యా సంస్థలు లక్షలాది మందికి విద్యార్థులకు బోధన అందిస్తున్నాయి. పాఠశాల విద్యలో ప్రత్యేకమైన ముద్ర వేసిన భాష్యం రామకృష్ణ ముందు నుంచీ టీడీపీ సానుభూతిపరులు.  ఆయన 2024లో గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. ఓ దశలో ఏలూరు లోక్‌సభ స్థానం ఇచ్చినా పోటీకి సిద్ధపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు టికెట్‌ ఇవ్వలేకపోయారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తామని అప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లే అవకాశమిచ్చారు.

2019, 2024 ఎన్నికల్లో రామకృష్ణ టీడీపీ తరపున పోటీలో ఉంటారని ప్రచారం జరిగినా రకరకాల సమీకరణలతో అది కర్యరూపం దాల్చలేదు. అయినా పార్టీకి అండగా ఉంటూ పలు కార్యక్రమాలో భాగస్వాములవుతూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కేరళంలకు కూడా విరాళాలు అందించి బాధితులకు అండగా నిలిచారు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా సేవలందించిన రామకృష్ణకు ఇప్పుడు టీడీపీ అధినేత సముచిత ప్రాధాన్యతనిచ్చారు. 

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అంటే భాష్యం రామకృష్ణకు అపారమైన అభిమానం. చంద్రబాబు తన విద్యా సేవల్ని గుర్తించి 2014 నుంచే రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవలో విస్తృత పాత్ర పోషించాలని ప్రోత్సహించారని రామకృష్ణ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానంటున్నారు. మొత్తానికి ఒక లెక్కల మాస్టారి అంకితభావం, పట్టుదల ఆయన్ని పెద్దల సభకు పంపిస్తోంది