రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు.. మరింత అప్రమత్తంగా ఉండాలి

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

దేశంలో వేలాది సంఖ్యలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులను కట్టిడి చేసేందుకు తీసుకోవల్సిన చర్యలపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శుల తో కోవిడ్ -19 నియంత్రణ పై ఆయన చర్చించారు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం, ట్రేసింగ్, టెస్టింగ్, ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కరోనా రోగుల మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడం పై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు సూచించారు.  పీపీఈ సూట్స్, , N-95  మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్ , ఇతర మౌళిక సదుపాయాల సమస్యల పై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు.

రాష్ట్రానికి కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడం , కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డి.జి.పి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజీవ్ గౌబా సూచించారు.