TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రశక్తే లేదు.. కేంద్రం స్పష్టీకరణ

Published on: Sat Mar 28, 2026 10:34AM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదా ఇతర సంస్థల్లో విలీనం ప్రశక్తే లేదని కేంద్రం విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర   మంత్రి  భూపతిరాజు శ్రీనివాసవర్మ పార్లమెంటు వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ విషయాన్ని తెలిపారు. వైవీసుబ్బారెడ్డి.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే, లేదా సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదన  ఉందా అని ప్రశ్రించారు. అందుకు అటువంటి పరిస్థితులేవీ లేవనీ, ఉత్పన్నం కావనీ మంత్రి కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ రంగం సంస్థగానే విశాఖ స్టీల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.  

ప్లాంట్‌లోని కొన్ని విభాగాల్లో బయటి ఏజెన్సీల ప్రమేయంపై వస్తున్న వార్తలపై వివరణ ఇస్తూ..  పరిశ్రమలోని కొన్ని ప్రత్యేక కార్యకలాపాల కోసం అవుట్‌సోర్సింగ్ లేదా బయటి ఏజెన్సీల సాయం తీసుకోవడం అనేది ఉక్కు పరిశ్రమలో సాధారణ ప్రక్రియ అన్నారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థల్లోనూ ఇదే విధానం అమలవుతోందనీ, దీనిని ప్రైవేటీకరణ దిశగా అడుగులుగా భావించకూడదన్నారు.

ఏపీలో సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు అంశంపై కేంద్రం ఈ స్థాయిలో స్పష్టత ఇవ్వడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా కార్మికులు, రాజకీయ పార్టీలు ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రి ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.