జగన్మాయ.. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ములు మాయం
Published on: Wed Jun 29, 2022 7:56AM
ఎవ్వరేమనుకుంటే నాకేం.. అధికారం నాది.. నిర్ణయం నాది అన్న చందంగా ఉంది సీఎం జగన్ తీరు. తాజాగా రాష్ట్రంలోని 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతల నుంచిరూ. 800 కోట్ల రూపాయలను వారి అనుమతి లేకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా జగన్ సర్కార్ విత్ డ్రా చేసేసింది.
గతంలో కూడా ఒక సారి ఇదే విధంగా చేస్తే ఉద్యోగులు ఫిర్యాదు చేసి తిరిగి డబ్బులు జమ చేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేశారు. ఎవరు మా డబ్బులు డ్రా చేశారో తెలియడం లేదని ఉద్యోగులు పైకి అంటున్నప్పటికీ ప్రభుత్వమే ఈ పని చేసిందని వారు విశ్వసిస్తున్నారు.
ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు మెసేజ్ లు వచ్చాయినీ, తన ఖాతా నుంచి 83 వేల రూపాయలు తనకే తెలీకుండా విత్ డ్రా చేసేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కే.సూర్య నారాయణ చెప్పారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్ల రూపాయలు వారికే తెలియకుండా విత్ డ్రా చేశారని, ఇది కచ్చితంగా ప్రభుత్వం చేసిన చోరీయేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయమై ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేయడానికి వెళితే అధికారులు అందుబాటులో లేకుండా పోయారని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా చేయడం నేరం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని చెప్పారు.


