పవన్ హామీ అమలుకు జగన్ సై!.. భయమే కారణమా?
Published on: Wed Apr 13, 2022 6:25PM
మాట తప్పం.. మడమ తిప్పమని హోరెత్తించే వైయస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి మాట తప్పింది.. మడమ తిప్పింది. ఇంటి వద్దకే రేషన్ అంటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకానికి ఈ జగన్ ప్రభుత్వం మంగళం పాడి.. హరతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా.. రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు... ఆవి వద్దనుకుంటే.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు ఇవ్వనుంది. మే నుంచి ఈ నగదు బదిలీ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర పౌరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
అందుకు అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులు .. ప్రతి నెల నగదు పంపిణి చేస్తారు. ఈ ప్రయోగాన్ని తొలుత అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతోపాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కిలో బియ్యానికి 12 నుంచి 15 రూపాయిలు రేషన్ కార్డుదారుడికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇలా రెండు నెలలు తీసుకున్న తర్వాత.. నగదు వద్దు.. బియ్యం కావాలంటే తీసుకోవచ్చునని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.
అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఇదే తరహాలో తన మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ప్రకటించారు. ఆయన కూడా... రేషన్ సరుకులకు బదులు కొంత నగదు.. రేషన్ కార్డుదారుడి ఖాతాలో వేస్తామని ఆయన క్లియర్ కట్గా వెల్లడించారు. తాజాగా జగన్ ప్రభుత్వం... గతంలో పవన్ చెప్పినట్లు చేస్తూ.. జనసేనాని బాటలో నడుస్తున్నారని గాజు గ్లాస్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.
మరోవైపు వైయస్ జగన్ అధికారంలోకి రావడంతోనే.. ఇళ్ల వద్దకే రేషన్ అంటూ భారీగా వ్యాన్లను కోట్లాది రూపాయిల ప్రజాధనంతో కొనుగోలు చేశారు. సదరు వాహనాల రవాణ కొసం డిజీల్, వాహనాలకు డ్రైవర్లు.. ఇలా పలువురు సిబ్బంది అవసరమవుతున్నారు. ఈ సిబ్బందికి జీతాలు, వాహనాల్లో అయిల్... ఇలా ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో పవన్ చెప్పినట్లు.. రేషన్ కార్డు హోల్డర్ల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. ప్రభుత్వానికి చాలా భారం తప్పుతోందని ఈ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరి కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కొనుగోలు చేసిన.. వేలాది వాహనాల పరిస్థితి ఏమిటనే చర్చ.. అప్పుడే ప్రజల్లో మొదలైందీ. అలాగే అందుకోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుందనే విమర్శలు అప్పుడే మొదలైనాయి. మరోవైపు.. మరిన్ని పథకాలకు మంగళం పాడేందుకు ఈ జగన్ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని.. అందుకోసం ఇప్పటికే కొన్ని పథకాలు.. లబ్దిదారులకు అందడం లేదని సమాచారం. ఏదో ఒక మెలిక పెట్టి.. నవరత్నాలను లబ్ధిదారులకు కట్ చేయడం కోసం.. ఈ జగన్ ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేస్తుందని... విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


