కాశ్మీర్‌ మీద వ్యాఖ్యలు: కవిత మీద బీజేపీ నేత కేసు

 

జమ్ము-కాశ్మీర్‌ని, హైదరాబాద్‌ని భారత ప్రభుత్వం దురాక్రమణ చేసిందని, జమ్ము-కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని వదులుకోవడానికి భారతదేశం సిద్ధపడాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ కవితకు ఇప్పుడు కష్టాలు వచ్చాయి. తెలంగాణ, జమ్మూకాశ్మీర్‌ల గురించి కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాద్‌లోని ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేశారు.