టీడీపీ గూటికి బైరెడ్డి.. ఎమ్మెల్యేగా పోటీ

 

కర్నూలు జిల్లాకు చెందిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. కొద్దినెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ సొంతగూటికి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరిక అంశం గురించి పార్టీ అధిష్ఠానంతో మంతనాలు జరిపిన ఆయన.. టీడీపీ తరపున శ్రీశైలం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమివ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేరుని అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఆయన అనూహ్యంగా పోటీ చేయనని, రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి టీడీపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం అంగీకరిస్తే రేపు లేదా ఎల్లుండి బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది.