కోస్తా ప్రజల నాడి తెలుస్తుందా?
Published on: Tue Apr 24, 2012 10:31AM
ఉప ఎన్నికలు జరుగనున్న 18అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17 స్థానాలు ఆంధ్రాప్రాంతంలో వుండటం వల్ల 2014 ఎన్నికల్లో ప్రజల నాడి ఏవిధంగా వుంటుందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో ఉప ఎన్నికలు జరిగే స్థానాలు వున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవి. ఆ స్థానాలకు చెందిన శాసనసభ్యులందరూ కాంగ్రెస్ ను వదిలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరినవారే. అందువల్ల ఈ ఉప ఎన్నికల ద్వారా కాంగెస్ పార్టీ కి ప్రాధాన్యత వుందా? లేక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత వుందా? అనే విషయం కొంతమేరకు అవగాహనకు వస్తుందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో కాంగెస్ పార్టీ ఓటింగ్ ఏ మేరకు చీలుతుంది, అది తెలుగుదేశంపార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతుందనే అంశం కూడా అర్థమయ్యే అవకాశం వుంది. ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మూడు స్థానాల్లో గలిచినా లేదా నాలుగుస్థానాల్లో గెలిచినా అదనంగా ప్రయోజనం పొందినట్లే. ఈ ఉప ఎన్నికల ద్వారా తెలుగుదేశంపార్టీ 2014 ఎన్నికలకు కొత్త ఎత్తుగడలతో సిద్ధమవ్వాడానికి వీలు కలుగుతుంది. ఉప ఎన్నికలు ఎన్నికలు జరిగే 18 స్థానాలలో ఒకటి (పరకాల) మాత్రమే తెలంగాణలో వుంది. ఈ ఎన్నిక ద్వారా జగన్ పట్ల తెలంగాణా ప్రజలు ఏ భావంతో వున్నారో కూడా అర్థం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గం తాజా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వుండటమే కాకుండా ఆమె తెలంగాణా నాయకురాలికంటే జగన్ అబిమానిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడం అందుకు కారణం.


