‘బండి’కి త్వరలో బుల్లెట్ ప్రూఫ్ కారు
Published on: Tue May 31, 2022 4:47PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి త్వరలో బుల్లెట్ ప్రూఫ్ కారు రానున్నది. పార్టీ అధిష్టానం ఆయన కోసం ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసి అందిస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోనికి తీసుకురావడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బండికి ప్రాణహాని ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
అధికార టీఆర్ఎస్ పై విమర్శలతో దూసుకెళుతున్న బండి సంజయ్ ఆ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదులను తవ్వాలి అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. బండి సంజయ్ హిందుత్వ అజెండాతో ముందుకు సాగుతున్నారన్న విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినవస్తున్న సంగతి తెలిసిందే.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బీజేపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. బండికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చాలని నిర్ణయించింది. రూ. 2 కోట్లు కేటాయించింది.ఇందుకోసం ఇప్పటికే కొటేషన్లు ఆహ్వానించింది.


