షాకింగ్.. జీవీఎల్ పై డీజీపీకి ఫిర్యాదు చేసిన బుద్దా!!

 

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య వివాదం ముదురుతోంది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చిన తరువాత బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కాస్తా జీవీఎల్ ఎంట్రీతో తారాస్థాయికి చేరిపోయింది. అవకాశం దొరికితే చాలు.. జీవీఎల్ టీడీపీ మీద, చంద్రబాబు మీద విరుచుకు పడుతుంటారు. ఇక జీవీఎల్ కి పోటీ వచ్చే నేత టీడీపీలో ఎవరైనా ఉన్నారా అంటే అది బుద్దా వెంకన్న అనే చెప్పాలి. ఏ నాయకుడు విమర్శలు చేసినా మెుట్టమెుదట టీడీపీలో ఖండించేది మాత్రం బుద్దా వెంకన్న అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాగే జీవీఎల్ కి కూడా బుద్ధా మాటకు మాట సమాధానం చెప్పారు. ఇలా వీరి మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసే వరకు వెళ్ళిపోయింది.

బుద్దా వెంకన్న హద్దుమీరి మాట్లాడుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు జీవీఎల్ ఫిర్యాదు చేసారు. దీనికి కౌంటర్‌గా బుద్దా వెంకన్న కూడా జీవీఎల్‌ ట్వీట్లపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై డీజీపీ ఠాగూర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేసును విజయవాడ పోలీస్ కమిషనర్‌కి రిఫర్ చేస్తామన్నారని బుద్దా వెల్లడించారు. జీవీఎల్‌ ట్వీట్లు బెదిరింపులకు పాల్పడేలా ఉన్నాయని బుద్దా వెంకన్న ఆరోపించారు. జీవీఎల్‌కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించక పోతే జీవీఎల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేస్తానని బుద్దా వెంకన్న హెచ్చరించారు.