ప్రధాని మోదీకి పోటీగా వారణాసి బరిలో జవాన్

 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ బరిలోకి దిగుతున్న వారణాసి నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేయనున్నట్లు బీఎస్‌ఎఫ్‌ మాజీ జవాన్ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని భద్రతా సిబ్బంది జవాన్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ 2017లో బహదూర్‌ సోషల్‌మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యల కింద ఆయనను విధుల నుంచి తొలగించారు. దీంతో బహదూర్‌ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. అయితే ఇప్పుడు బహదూర్‌.. వచ్చే ఎన్నికల్లో మోదీపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భద్రతాబలగాల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బహదూర్‌ తెలిపారు. ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెప్పగానే చాలా రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని వెల్లడించారు. ‘ఎన్నికల్లో గెలవడం, ఓడటం అనేది కాదు.. భద్రతాబలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఈ పోటీకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు సంపాదించేందుకు మోదీ యత్నిస్తున్నారు. కానీ ఆ జవాన్ల కోసం ఆయన ప్రభుత్వం ఏమీ చేయలేదు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదు’ అని బహదూర్‌ విమర్శించారు.