ఏపీలో కొత్త పార్టీపై అనిల్ క్లారిటీ.. వివేక హత్యపై సంచలన కామెంట్లు
Published on: Mon Mar 14, 2022 3:54PM
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ తనకు అవసరం లేదని, జగన్ చాలా బిజీగా ఉన్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త, సువార్తీకుడు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. తాను జగన్ ను కలిసి రెండున్నరేళ్లు అయిందన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారాయి. అక్కడితో ఆగకుండా బీసీని ముఖ్యమంత్రిగా చెయ్యాలని ఏపీలో కూడా డిమాండ్ వస్తోందని, అభిమానుల కోరికను తాము నెరవేస్తామని బ్రదర్ అనిల్ అనడం గమనార్హం.
ఉత్తరాంధ్ర లో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని, తమ పరిస్థితిని వినేవాళ్ళు ఎవరూ లేరని ఆయా సంఘాల నేతలు తనకు చెప్పారని బ్రదర్ అనిల్ అన్నారు. గత ఎన్నికల ముందు ఆయా సంఘాల సహాయం తాను అడిగానని అనిల్ తెలిపారు. అయితే.. ఎన్నికల అనంతరం ఆ సంఘాలు తమ ఆ ఆకాంక్షలు నెరవేరలేదని అసంతృప్తిగా ఉన్నాయని బ్రదర్ అనిల్ వెల్లడించారు. దీనిపై తాము సీరియస్ గా ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
పార్టీ పెట్టమని తనను అభిమానులు అడుగుతున్నారని, అయితే.. పార్టీ పెట్టడం అంటే చాలా పెద్ద విషయం అని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు. జగన్ బాబాయ్, తన చిన్న మామ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని అనిల్ వ్యాఖ్యానించారు.


