మజ్లీస్ కంచుకోటలో మోదీ వ్యూహం..!!

1984 నుంచి మొద‌లుకుని 2014 వ‌ర‌కు వ‌రుస‌గా తొమ్మ‌దిసార్లు జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ సీటు మ‌జ్లిస్ కు కంచుకోట‌గా మారింది.ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న అస‌దుద్దీన్ ఒవైసీ మూడుసార్లు విజ‌యం సాధించాడు.హైద‌రాబాద్ లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేయాల‌ని ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నిస్తుంది మ‌జ్లిస్ పార్టీ. కానీ, సాధ్య‌మ‌వ్వ‌డం లేదు. ముస్లీం ఓట్లే ల‌క్ష్యంగా ప్ర‌తీసారి గ‌ట్టిపోటీనే ఇస్తున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ చెప్పుకోద‌గ్గ స్థానాల్లో గెల‌వ‌డం లేదు. ఒక్క హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స్థానంతో పాటు న‌గ‌రంలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తూ వ‌స్తుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటూ త‌మ ఉనికిని కాపాడుకుంటోంది మ‌జ్లిస్.అయితే హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స్థానాన్ని కైవ‌సం చేసుకునేందుకు బీజేపీ ఎప్ప‌టినుంచో తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తుంది.బీజేపీ ల‌క్ష్యం ఒవైసీ బ్ర‌ద‌ర్స్ ను ఓడించ‌డ‌మే.మ‌జ్లిస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఓడించేందుకు ఆయా స్థానాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌నే నిలుపుతూ వ‌స్తుంది.ముస్లీం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న హైద‌రాబాద్ పార్ల‌మెంట్ సీటును కైవ‌సం చేసుకోవ‌డం అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.

 

 

గ‌తంలో ఈ సీటును గెలుచుకునేందుకు వెంక‌య్య నాయుడు, బ‌ద్దం బాల్ రెడ్డి వంటి అగ్ర‌నేత‌ల‌ను బ‌రిలోకి దింపింది బీజేపీ. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అయితే, ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోని హిందూ ఓట్ల‌ను త‌మ వైపుకు తిప్పుకోగ‌లిగితే ఒవైసీని ఓడించ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాద‌న్న భావ‌న‌లో బీజీపీ నాయ‌కులు ఉన్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన హిందుత్వ‌వాదం వినిపించే నాయ‌కుడ్ని బ‌రిలో దింపాల‌న్న ప్ర‌య‌త్నాల్లో బీజేపీ క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టింది. ముస్లిం ఓట్లే ఆయుధంగా గెలుస్తూ వస్తున్న ఒవైసీని ఢీకొట్టేందుకు హిందూత్వవాదిగా తరచూ వార్తల్లో ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ జాతీయ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీకి దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి గెలవాలని ఇటీవల అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌వాల్ ను సీరియ‌స్ గా తీసుకున్న బీజేపీ జాతీయ నాయ‌కులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌జ్లిస్ కంచుకోట‌ను కూల్చ‌డ‌మే ల‌క్ష్యంగా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.