TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ,టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందా? ఒంటరి పోరు ఎవరికి లాభం?

Published on: Thu May 18, 2017 12:58PM

 

2014లో కలిసి పోటీచేసిన టీడీపీ, బీజేపీ... ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లు వ్యవహారిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని నెలలుగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. రెండు పార్టీల నేతలు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. మిత్రపక్షాలైనప్పటికీ ఎక్కడా కలిసి ఆందోళనలు, ధర్నాలు చేసిందే లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ వేర్వేరుగానే ఉన్నారు.

 

బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆంధ్రా పార్టీ అంటూ టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. టీడీపీని పక్కన పెట్టకపోతే తమకూ నష్టం కలుగుతుందని అంచనాకి వచ్చిన తెలంగాణ బీజేపీ నేతలు... వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. వేరే రాష్ట్రంలో పొత్తులకు తమకి ఎలాంటి సంబంధం లేదన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌... ఇక్కడ మాత్రం టీడీపీతో పొత్తు ఉండదనే సంకేతాలు పంపించారు.

 

అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ నేతలు బహిరంగంగానే టీడీపీ పాలనను విమర్శిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఏపీలో కూడా బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేయడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకొని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

 

అయితే తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం... అప్పుడే పొత్తులపై చర్చ అనవసరం అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చని, ఈ రెండేళ్లలో ఏమైనా జరగొచ్చని చెబుతున్నారు. అయినా మహాకుటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చూస్తుంటే బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం కరెక్టు కాదంటున్నారు