ఫ్రీ కరోనా వ్యాక్సిన్.. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు! గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టో 

గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని ప్రకటించింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు అందిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ పాలన సాగిస్తామని తెలిపింది. 

 

మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, మహిళల కోసం నగరంలో కిలోమీటరుకో టాయిలెట్, టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు, గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్, 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, కులవృత్తులకు ఉచిత విద్యుత్ , ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ, వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక, వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది బీజేపీ. 

 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని, ప్రజల సలహాలు స్వీకరించి మేనిఫెస్టోను రూపొందించామని ఫడ్నవీస్ తెలిపారు. కరోనా పేరుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మోడీ సర్కారు కాపాడుతోందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే హైదరాబాద్ మునిగిపోయిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.