గవర్నర్ జీ అమరావతి పై జోక్యం చేసుకోండి: బీజేపీ
posted on Sep 11, 2019 3:31PM
ఎపి రాజధాని అమరావతి మార్పు విషయం లో మంత్రి బొత్స రోజుకొక వ్యాఖ్య చేయడమతొ ప్రజలలో మరీ ముఖ్యంగా భూములిచ్చిన రీతులలో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయమై ఈ రోజు బీజేపీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ నేతృత్వంలో రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజధాని మార్పు విషయంలో వైసీపీ నేతలు, మంత్రులు ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడాన్ని ఈ సందర్భంగా వారు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా.. ఈ విషయంపై ఇంతవరకు ముఖ్యమంత్రి స్పందించలేదని బీజేపీ నేతలు తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నాయకులు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. దీనికి గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు తెలిపారు.