ఒక ఆకురౌడీ మంత్రి అయితే మాట్లాడే భాష, పాలన ఇలాగే ఉంటాయి.. జగన్ సర్కార్ పై బీజేపీ నేత ఫైర్

ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ పై సంతకం విషయంలో తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంత్రి కొడాలి నాని అటు తిరుమల వెంకటేశ్వర స్వామి పై అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారం రేపుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్‌ స్పందిస్తూ ‘‘ఆకురౌడీ.. మంత్రి అయితే కేవలం భాష, బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు పాలన కూడా ఎలా ఉంటుందనే దానికి ఏపీ ప్రత్యక్ష నిదర్శనం’’ అని వైసిపి సర్కార్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెంచకుండా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ.. భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం చేస్తున్నారని అయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిన్న జరిగిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ "ఒక మంత్రి సాక్షాత్తు దేవుడి పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే సీఎం జగన్‌ మాత్రం కనీసం నోరు తెరవడం లేదని.. అసలు ఆయన ఏం చేస్తున్నారని సత్యకుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందని అయన అన్నారు.

 

తిరుమలలో డిక్లరేషన్‌ విషయంలో అందరికంటే ముందు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారని.. అయితే ప్రభుత్వ జీవోను సాక్షాత్తు ముఖ్యమంత్రే పాటించకపోతే ఇక సామాన్యులకు ఏం చెబుతారని అయన నిలదీశారు. ప్రజా సమస్యలతోపాటు పాలన పై స్పష్టతలేని సీఎం జగన్‌, పొరుగు రాష్ట్రాల్లోనేగాక విదేశాల్లో నియమించుకున్న అంతర్జాతీయ సలహాదారులతో చర్చించి అయినా పాలన సజావుగా సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు సీఎం జగన్‌ తన పేరు, తన తండ్రి పేరు పెడుతున్నారని.. ఏకంగా కొవిడ్‌-19 పాస్‌పై కూడా వైఎస్సార్‌ అని ముద్రించడం దీనికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. ఏకంగా ప్రధాని మోదీపై తన కేబినెట్‌ లోని మంత్రితో విమర్శలు చేయించి, తరువాత తాపీగా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటే ఆశ్చర్యకరంగా ఉందని సత్యకుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.