బండిని దూరం పెట్టిన బీజేపీ.. ప్రధాని టూర్ కు నో ఆహ్వానం
Published on: Sun May 10, 2026 7:36AM

కేంద్రమంత్రి బండి సంజయ్ ను బీజేపీ దూరం పెట్టిందా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) హైదరాబాద్ పర్యటనకు వస్తున్న వేళ బండి సంజయ్ కు గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనలో ఆహ్వానితుల జాబితాలో బండి సంజయ్ పేరు లేదు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరవుతున్న ప్రధాని మోడీ కార్యక్రమంలో బండి సంజయ్ కు మాత్రం స్థానం లేకుండా పోయింది.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
అయితే దీనిపై బీజేపీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ మైనర్ బాలికను వేధించిన వ్యవహారం తెరపైకి రావడం, పోక్సో కేసు నమోదు చేయాలనే డిమాండ్లు, అదే సమయంలో అతనిపై హనీ ట్రాప్ జరిగినట్లు బీజేపీ వర్గాలు చెప్పడం వంటి కారణాల నేపథ్యంలో బండి సంజయ్ ను ప్రధాని టూర్ కు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది.


