కాంగ్రెస్, టిడిపిలతో పోటీకి సై అంటున్న కమలనాథులు
Published on: Fri May 4, 2012 9:54AM
మహబూబ్ నగర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బిజెపి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపిలకు ప్రత్యామ్నాయశక్తిగా ఎదగటానికి వ్యూహాలు రచిస్తోంది. భీమవరంలో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ మేరకు పార్టీ రాష్ట్రనాయకులు సుదీర్ఘచర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉప ఉన్నికల అనంతరం సీమాంధ్రలో 'జైఆంధ్ర' ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపట్టాలని బిజెపి నిర్ణయించింది. ఇప్పటికే పలు సీమాంధ్ర జిల్లాల్లో జైఆంధ్ర సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు.
అందుకే ఉప ఎన్నికల తరువాత సీమాంధ్రలో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతోపాటు తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజెపి నిర్ణయించింది. వచ్చే ఉప ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాదన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. రాష్ట్రంలో జగన్ ప్రభావం కారణంగా కాంగ్రెస్, టిడిపిలు బలహీనపడ్డాయని, అందువల్ల ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగటానికి ఇదే మంచి తరుణమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.


