బీజేపీ డబుల్ గేమ్ కంటిన్యూ..
Published on: Wed Mar 12, 2025 10:44AM

ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి ఏపీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నామని చెబుతూనే.. మరో పక్క వైసీపీ ప్రయోజనాలు ఇసుమంతైనా దెబ్బతినకుండా ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతోంది. సోము వీర్రాజు ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ ఇంకా జగన్ కు అండదండగానే ఉందనడానికి సోముకు ఎమ్మెల్సీ టికెట్ కంటే గట్టి తార్కానాలు, ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా రాజ్యసభలో ప్యానల్ వైస్ చైర్ పర్సన్ గిరీని వైసీపీ ఎంపీ నిరంజనర్ రెడ్డి దక్కించుకున్నారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ అంటే డిప్యూటీ స్పీకర్ తో సమానం. అటువంటి కీలకమైన పోస్టును వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి దక్కించుకున్నారు.
గతంలో అప్పటి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ప్యానల్ వైస్ చైర్మన్ గా ఉండేవారు. ఆయన వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత నిరంజన్ రెడ్డిని ఆ స్థానంలో కేంద్రం భర్తీ చేసింది. అంటే ఇప్పటికీ వైసీపీకి క మలం పార్టీ ఎంత దన్నుగా నిలుస్తోందో అర్ధమౌతుంది. ఇంతకీ నిరంజన్ రెడ్డి ఎవరంటే.. జగన్ కేసులను వాదించే సీనియర్ లాయర్. అసలు నిరంజన్ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపించడానికి కారణమే ఆయన తన కేసులు వాదించడం అనడంలో సందేహం లేదు. నిరంజన్ రెడ్డి తెలంగాణ వాసి అయినా, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా కూడా జగన్ రాజ్యసభకు పంపించడానికి ఒకే ఒక కారణం ఆయన జగన్ కేసులు వాదిస్తుండటమేనని పరిశీలకులు విశ్లేషణ.
రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లను రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సోమవారం (మార్చి10) ఎంపిక చేశారు. మొత్తం ఎనిమిది మంది ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లకు ఎంపిక చేస్తారు. ఆ ఎనిమిది మందిలో వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఒకరు. సాధారణంగా రాజ్యసభలో సీనియర్లు, సంఖ్యా బలం ఎక్కువగా ఉన్న పార్టీల సభ్యులను ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లుగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లు రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేని సమయంలో చైర్ లో కూర్చుని సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అటువంటి కీలకమైన పోస్టుకు సీనియారిటీ లేకపోయినా, సంఖ్యాబలం కూడా అంతంతమాత్రమే అయినా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డిని ఎంపిక చేయడమే బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ కు అద్దంపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


