TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణా సాధ‌న‌కు బీజేపీ చ‌ద‌రంగం

Published on: Fri Jul 29, 2022 9:07PM

ప‌క్క‌రాజ్యం మీదకి యుద్ధానికి వెళితే ఏమేర‌కు గెలుస్తాము, వారి సైన్యం ఎంత  సామర్థ్యం తెలుసుకోవ‌డానికో రాజులు వేగుల్ని రంగంలోకి దింపేవారు. స‌రిగ్గా అదే పంధాను ఇప్ప‌డు బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు రానున్న ఎన్నికలకు  అనుస‌రిస్తున్నార‌నిపిస్తోంది. వారికి తెలంగాణాలో దొరికిన గొప్ప తెలివిమంతుడు, స్వ‌ర పేటికా బాగా ఉన్న‌వాడు, అన్నింటికీ మించిన వేగుచుక్క బండిసంజ‌య్. తెలంగాణాలో రాజ‌కీయ ప‌రిస్థితులే గాకుండా పార్టీల‌ వారీగా బ‌ల‌మైన నేత‌ల జాబితాను కూడా త‌యారుచేసి మ‌రీ నివేదిక‌తో పాటు పంపిన‌ట్టు తెలు స్తోంది. బీజేపీ అధిష్టానం తెలంగాణాలో కూడా గోవా మోడ‌ల్ అమ‌లు చేయాల‌న్న దృష్టిలో ఉంద‌ని, గెలుపు గుర్రాలనే గుర్తించి చెప్ప‌మ‌ని బండి వారిని బీజేపీ అధిష్టానం కోరిందట. పనిలో పనిగా  రాష్ట్రంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప్రత్యర్థి పార్టీలలోని ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల్లో చురుకైన‌వారినీ గుర్తించ మ‌ని తెలంగాణా బీజేపీ అధ్య‌క్షుడికి బాధ్య‌త‌ను కమలం టాప్ బ్రాస్ అప్పగించిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అంటే కేంద్రం తెలంగాణా మీద ఎంత దృష్టి కేంద్రీక‌రించిందో అర్ధ‌మ వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్తగా పావులు క‌దిపే ప‌నిలో ఉంది. 

తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఎంతో ప‌క‌డ్బందీగా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌నే అనాలి. మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌వ‌ర్గాల‌ను నాలుగు క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి ప్ర‌తీ నాలుగు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక కేంద్ర మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియ‌మించారు.  ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లకుఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా,  హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. వీరితో పాటు ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్,  హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మం‌కు బీఎల్ వర్మను నియమించారు.తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు.