TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశం, జనసేనలతో పొత్తు ఏపీకే పరిమితం.. తేల్చేసిన అమిత్ షా

Published on: Wed Jun 10, 2026 3:01PM

ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ జనసేనకు తెలంగాణలో కమలం అండ ఆశలను ఆవిరి చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఒంటరిగా బలోపేతం కావాలని భావిస్తున్న తెలుగుదేశం ఆశలకు ఊపిరి పోసింది. 

మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు.  దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న   తరుణంలో..  కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో   పొత్తుతో  2024 ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీ.. ఆ పొత్తు తెలంగాణలో పొసగదని కుండబద్దలు కొట్టేసినట్లైంది.  తెలంగాణలో కమలంతో కలిసి చక్రం తిప్పాలని ఆశిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు బీజేపీ నిర్ణయం ఒకింత నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 

అమిత్ షా చేసిన ఈ తాజా అధికారిక ప్రకటన ప్రకారం, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలతో పాటు, 2028లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు.  దీంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. బీజేపీ ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం లో హర్షం వ్యక్తం అవుతున్నది. పొత్తులు లేకుండా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఇది స్వాగతించే విషయమే. ఎందుకంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉంది కానీ కార్యకర్తల బలం, బలగం ఇప్పటికీ చెక్కు చెదరలేదనే చెప్పాలి. అందుకే విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీలూ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం వెంపర్లాడాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో అంటే 2023లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీపడి మరీ తెలుగుదేశం జెండాను భుజాన మోశారు. కాంగ్రెస్ ఎలక్షన్ ర్యాలీలలో అయితే బాహాటంగానే టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. 

దీంతో తెలంగాణలో ఒంటరి పోరే అన్న బీజేపీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బలమైన క్యాడర్, విస్తృతమైన అభిమాన వర్గం ఉంది.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు,  మెకానిజం చాలా వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి.. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కడంలో కీలక పాత్ర పోషించాయి.  అదే  రాష్ట్రంలో తెలుగుదేశం బరిలో ఉంటే ఆ క్యాడర్, మెకానిజం తెలుగుదేశానికి బలంగా మారతాయి. ఇప్పటి వరకూ  తెలంగాణలో  జనసేన ముద్ర పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.   తెలంగాణ రాజకీయాల్లో   సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒంటరి పోరు జనసేనకు అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.