రెడ్ల సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం
Published on: Sun May 29, 2022 10:58PM
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఘట్ కేసర్ లో ఆదివారం జరిగిన రెడ్ల సింహగర్జన సభలో మంత్రి ప్రసంగిస్తుండగా జనం అడ్డుకున్నారు. ఆయన ప్రసంగం పట్ల ఆగ్రహం వ్యక్త చేశారు. రెడ్ల సింహగర్జన సభలో ముఖ్యమంత్రిపై ప్రసంగాలెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందంటూ మల్లారెడ్డి తన ప్రసంగంలో చెప్పినప్పుడూ సభికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన ప్రసంగిస్తుండగా ఆయనపై రాళ్లు, చెప్పులువిసిరారు.
సభ అనంతరం ఆయన వెళ్లి పోతున్నప్పుడు కూడా ఆయన కారుపైకి కుర్చీలు, నీళ్ల బాటిళ్లు విసిరేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో మంత్రుల బస్సు యాత్ర సభలు జనం లేక వెలవెల పోవడం, తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై చెప్పులు, రాళ్లు విసరడం ఇందుకు నిదర్శనాలుగా వారు చూపుతున్నారు.
కాగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు యోచిస్తున్నాయనీ, అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి, రాజకీయ హడావుడి కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు.


