బాబోయ్ బర్డ్ ఫ్లూ.. చికెన్ జోలికెళ్లొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
Published on: Tue Feb 11, 2025 11:42AM
.webp)
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికించేస్తోంది. పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఒక్క రోజులోనే దాదాపు లక్ష కోళ్లు మరణించిన సంఘటనతో అప్రమత్తమైన పశుసంవర్థక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్ కు పంపారు. అక్కడి ల్యాబ్ లో పరీక్షల తరువాత కోళ్ల మరణానికి బర్డ్ ఫ్లూ కారణమని తేలింది. ఒక్క పెరవలిలోనే కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఆ మరణాలన్నీ బర్డ్ ఫ్లూ కారణంగానేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక తెలంగాణలోని ఖమ్మం, సత్తుపల్లిలో కూడా కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూయే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల వరకూ చికెన్ జోలికి వెళ్లవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సూచించింది.


