ఐఏఎస్ అధికారి ఆత్మహత్య.. రైలు పట్టాలపై మృతదేహం
posted on Aug 11, 2017 11:34AM
బీహార్ లో మరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. ముఖేష్ పాండే బీహార్ లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పని చేస్తున్నాడు. ఆయన వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్ స్టేషన్ కు సమీపంలో ఆయన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. సూసైడ్ నోటును స్వాదీనం చేసుకున్నారు. ‘నేను.. ముఖేశ్ పాండే, ఐఏఎస్ 2012 బ్యాచ్ బిహార్ క్యాడర్ అధికారిని. ప్రస్తుతం బక్సర్ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్)గా పనిచేస్తున్న నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు వార్తను మా వాళ్లకు తెలియజేయండి. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలన్నింటినీ ఒక నోట్లో రాశాను. లీలా ప్యాలెస్ హోటల్(ఢిల్లీ)లో నేను దిగిన రూమ్ నంబర్ 742లో నైక్ బ్యాగ్లో ఆ నోట్ ఉంది’ అని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లి చూడగా... ‘మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేకుండా పోయింది. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని రాసిఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్నామని..పూర్తి దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.
కాగా ముఖేశ్ పాండే మృతికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం తెలిపారు. ముఖేశ్ పాండే సమర్థుడైన అధికారి అని, బక్సర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.