TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్లో బీజేపీ డౌటేనా?

Published on: Fri Nov 6, 2015 3:27PM



బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం నాడు చివరి దశ పోలింగ్ పూర్తయ్యే వరకూ రాజకీయ పరిశీలకుల అంచనాలు కొద్ది రోజులు అటూ ఇటూ మారాయి. కొద్ది రోజులపాటు పరిస్థితి ఎన్డీయే కూటమికి కూటమికి అనుకూలంగా వున్నట్టు పరిశీలకులు భావించారు. ఆ తర్వాత పరిస్థితి నితీష్ కుమార్ నాయకత్వంలోని లౌకిక కూటమికి అనుకూలంగా మారుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్డీయే హవా నడవబోతోందని అనుకున్నారు. అయితే గురువారం చిట్టచివరి విడత పోలింగ్ పూర్తయిన తర్వాత పరిస్థితి గమనిస్తే బీహార్లో మళ్ళీ నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చే అవకాశాలున్నాయన్న సూచనలు కనిపిస్తు్న్నాయని అంటున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నాయి. మొత్తం ఏడు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో ఐదు సంస్థలు మళ్ళీ నితీష్ గవర్నమెంట్ రానుందని చెబితే, రెండు సంస్థలు మాత్రం ఎన్డీయే అధికారంలో కావచ్చన్నట్టుగా ఫలితాలను వెల్లడించాయి.

అయితే బీహార్లో ప్రస్తుతం నెలకొన్న ‘హవా’ని గమనిస్తే మాత్రం నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నితీష్ కుమార్‌కి వున్న క్లీన్ ఇమేజ్ ఆయన విజయానికి దోహదం చేయనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదట లౌకిక కూటమితో జతకట్టిన ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత దూరమైనా, అవినీతిపరుడిగా ముద్ర వున్న లాలూ ప్రసాద్ యాదవ్ లౌకిక కూటమిలో వున్నప్పటికీ ప్రజలు నితీష్‌ వైపే మొగ్గు చూపించారని భావిస్తున్నారు. ఈ ఎన్నికలలో తన నాయకత్వంలో వున్న ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి విషయంలో నితీష్ కుమార్‌తో పోటీ పడబోనని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడం కూడా ఒక శుభ పరిణామమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బీజేపీ నాయకులు అంగీకరించకపోయినప్పటికీ, వారి మనసులలో ఇప్పటికే గుబులు బయల్దేరిందని చెప్పవచ్చు.