బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సరికొత్త నిబంధనలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వివరాలు తెలిపారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు, మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అక్టోబరు 28న తొలి దశలో 71 స్థానాల్లో, నవంబరు 3న రెండో దశలో 94 స్థానాల్లో, నవంబరు 7న మూడో దశలో 78 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. నవంబరు 10 ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని రావత్ ప్రకటించారు.

 

బీహార్‌లో మొత్తం 7.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కరోనా నిబంధనల మేరకు బీహార్‌లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కరోనా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందేనని తెలిపారు. భారీ ర్యాలీలు, బహిరంగ సభలకు ఏమాత్రం అనుమతి లేదని తెలిపారు. నామినేషన్లు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే నింపాలని, డిపాజిట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా కట్టాలని ఆయన సూచించారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా కేవలం ఐదుగురు కార్యకర్తలు మాత్రమే వెళ్లాలని, నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థితో కేవలం ఇద్దరు మాత్రమే రావాలని స్పష్టం చేశారు.

 

బీహార్‌లో పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌లో వెయ్యి మంది ఓటర్లను అనుమతిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని, పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఇస్తామని తెలిపారు. వృద్ధులు, కరోనా రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోస్టల్‌ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌ సమయాన్ని మరో గంట పెంచుతున్నామని తెలిపారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, అయితే, కరోనా దృష్ట్యా ఈసారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని సునీల్ అరోరా ప్రకటించారు.