TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఓపెనింగ్ జులై 5

Published on: Sat Apr 11, 2026 11:26AM

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టును జూలై 5వ తేదీన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   నిర్ణయించింది. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సంగతి తెలిసిందే.  

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి   అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక చారిత్రక ఘట్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం విమానాశ్రయ ప్రాంగణంలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీఎంఆర్  ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. తొలి విడతలో  ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా   సౌకర్యాలను కల్పిస్తున్నారు. రవాణా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విశాఖ నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల కోస్టల్ హైవే పనులను కూడా జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటక పరంగా గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదగడానికి కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక భూమిక పోషించనుంది. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ అధికారులు ఎయిర్‌పోర్ట్ భద్రత మరియు ఇతర సాంకేతిక అంశాలపై తుది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే ప్రారంభోత్సవ వేడుకపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ విమానాశ్రయం ప్రారంభమైతే, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణ అనుభవం ఉత్తరాంధ్ర వాసులకు సొంతం కానుంది.