స్టేట్ రౌడీ .. పశ్చిమలో పొలిటికల్ వే'డీ'

పవన్ స్టేట్ రౌడీ. జన సైనికులు ఆకు రౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి జనసేనానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమలో వైసీపీ, జనసేన మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మత్స్యపురి దళితుల వివాదం కాక రేపుతుండటంతో స్వయంగా పవన్ కల్యాణే రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఉద్దేశించి.. ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

జనసేనాని కామెంట్లకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ స్టేట్‌రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అన్నారు. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్నారు. రెండు చోట్ల అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారు’అంటూ ఘాటైన విమర్శలు చేశారు గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల డైలాగ్ వార్ తో పశ్చిమలో రాజకీయ రచ్చ రగులుతోంది.