TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికార లాంఛనాలతో భారతీ రాజా అంత్యక్రియలు

Published on: Wed Jun 10, 2026 12:34PM

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా అంత్యక్రియలను అధికార  లాంఛనాలతో జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. 

చెన్నైలోని భారతీ రాజా నివాసానికి వెళ్లిన సీఎం విజయ్  ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.    చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు భారతీరాజా అని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్  తన సంతాప సందేశంలో పేర్కొంది.  అలాగే భారతీరాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. 

 కాగా.. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తన అద్భుతమైన సృజనాత్మకతతో వెండితెరపై సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా  మరణం భారత చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భారతీరాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న పవన్ కల్యాణ్ ఆయన దర్శకత్వంలో వచ్చిన  ఆరాధన సీతాకోకచిలుక వంటి చిత్రాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. భారతీ రాజా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.