భాను లొంగుబాటు పోలీసులు అరెస్టుగా చూపారా?
Published on: Tue Apr 24, 2012 10:11AM
ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాననిందుతుడైన భానుకిరణ్ స్వచ్చందంగా లొంగిపోవటానికి ముందుకు వచ్చారని, ఆ తరువాత పోలీసులు దీనిని అరెస్టుగా చూపారని తెలుస్తోంది. భాను లొంగుబాటు, అరెస్టు డ్రామా వెనుక రాష్ట్రంలో కీలకమైన శాఖను నిర్వహిస్తున్న ఒక మహిళా మంత్రి కుమారుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సూరి హత్య జరిగి ఏడాదిన్నర దాటుతున్న నిందుతుడిని అరెస్టు చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి వారు మంత్రి కుమారుడి సహాయసహకారాలు తీసుకున్నట్లు తెలిసింది.
గతంలో భాను శ్రీనగర్ కాలనీలోని ఆ మంత్రిగారి ఇంటి వద్దే తచ్చాడుతూ ఉండేవాడని, సూరి హత్య తరువాత అతని ఆచూకీ తెలియలేదని స్థానికులు అంటున్నారు. భాను మంత్రిగారి కుమారుడితో పాటు అనేకసార్లు అనేక ప్రాంతాలకు కలిసి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పోలీసులకు తెలిసినప్పటికీ ఆ మంత్రిగారే తమ శాఖకు అధిపతి కావటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు భాను అరెస్టులో వైఫల్యాన్ని ప్రముఖంగా చెబుతున్నాయి. ఇది పోలీసులతో బాటు ఆ మంత్రిగారికి కూడా ఇబ్బందికరంగా మారడంతో ఆమె తన కుమారుడిని గట్టిగ మందలించి భాను లొంగుబాటును అరెస్టుగా చూపించినట్లు తెలుస్తోంది. మంత్రిగారి కుమారుడి అభయం ఉన్నందువల్లే భాను అరెస్టు అయిన తరువాత కూడా నవ్వుతూ రిలాక్స్ డ్ గా కనిపించాడు.


