TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బిచ్చగాడు సినిమానే తలదన్నే రియల్‌ స్టోరీ... విజయనగరంలో రియల్‌ బిచ్చగాడు

Published on: Sat Jun 3, 2017 6:29PM

 

అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న తల్లిని బతికించుకునేందుకు భిక్షగాడుగా మారతాడు బిలీనియర్‌.... ఇది సూపర్‌ డూపర్‌ హిట్టయిన బిచ్చగాడు సినిమా కథ‌... బిచ్చగాళ్ల అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా.... ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటే.... విజయనగరం జిల్లాలో రియల్‌ బిచ్చగాడు తన దాతృత్వంతో.... ప్రజల మనసులను గెలుచుకుంటున్నాడు. సమాజానికి కొంతైనా తిరిగి ఇచ్చేయాలన్న శ్రీమంతుడు మూవీ థియరీని మనసావాచా పాటిస్తున్నాడు విజయనగరంలో ఓ భిక్షగాడు.

 

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం దగ్గర 20ఏళ్లుగా భిక్షాటన చేస్తోన్న చేబోలు కామరాజు... అక్కడే చిన్న గుడారం వేసుకుని బతుకుతున్నాడు. భక్తులు ఇచ్చిన దాంట్లో ఒక్కో రూపాయి దాచుకుని... బ్యాంక్ బాలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బిచ్చగాడు... తనకు భిక్షమేసిన భక్తుల మేలు కోసం తిరిగి లక్ష రూపాయలు విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. గుడికి వచ్చే భక్తులు... ఎండలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ఆలయ కమిటీ... షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న బిచ్చగాడు కామరాజు.... తాను దాచుకున్న డబ్బులో నుంచి లక్షా 20వేల రూపాయలు విరాళమిచ్చాడు. అన్నదే తడువుగా బ్యాంకు నుంచి డబ్బు తీసుకొచ్చి ఆలయ కమిటీకి అందజేశాడు.

 

తనకెవరూ లేరంటున్న చేబోలు కామరాజు... ఆ దేవుడు ఇచ్చింది.... తిరిగి దేవుడికే ఇచ్చేస్తున్నా అంటున్నాడు. అంతేకాదు షెల్టర్ల నిర్మాణం పూర్తయ్యాక మరో పదివేల ఖర్చుతో భక్తులకు అన్నదానం చేస్తానంటున్నాడు. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నానని, కుటుంబ సభ్యులు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. తనకు భిక్షమేసిన భక్తుల సౌకర్యం కోసం తాను దాచుకున్న డబ్బుంతా విరాళమిచ్చిన చేబోలు కామరాజును స్థానికులు అభినందిస్తున్నారు. అంతేకాదు భిక్షాటన డబ్బుతోనే ఇద్దరు పిల్లల చదువుకు ఆర్ధిక సాయం చేస్తున్నాడని.... మెచ్చుకుంటున్నారు.