అలరించిన బీసీ విద్యార్థుల కళా ప్రదర్శనలు
Published on: Thu Jun 2, 2022 2:39PM
చేతివృత్తుల్లో సృజనాత్మకతను కనబరుస్తూ సమాజాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న బీసీ వర్గాల పిల్లలు చదువులతో పాటు సాంస్కృతిక కళా వారసత్వంలో తమ ప్రతిభను చాటుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో లలిత కళల్లో మంచి ప్రావీణ్యం సాధించారు. స్వల్పకాలం శిక్షణలోనే వారు త కళాకారులుగా సత్తా చాటారు. సాంస్కృతి కార్యక్రమాలతో పాటు అనంతవిశ్వంపై ఆసక్తిని కనబరిచారు.

గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయిలో నిర్వహించిన నృత్య పోటీల్లో ఎంపికైన వారితో రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శన ప్రముఖ నృత్య గురువులైన న్యాయనిర్జేతలే ఔరా అనేలా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిసి హాస్టల్స్ నుంచి ఎంపిక చేసిన మూడు వందల మంది విద్యార్థులు 45 బృందాలుగా ఏర్పడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాగర్ కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన భారత్ మాతాకి జై నృత్యం ప్రధమ బహుమతి అందుకోగా, కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రదర్శించిన అల్లా నేరేల్లో రెండవ బహుమతి, మెదక్ జిల్లా విద్యార్ధులు ప్రదర్శించిన తూరుపు కొండల్లో నృత్య ప్రదర్శన మూడో బహుమతి అందుకుంది.
సాహిత్యాన్ని, కళలను రేపటి తరానికి అందించాలంటే ఈ తరం పిల్లలకు వాటిని చేరువ చేయాలని, అందులో భాగంగానే బిసి హాస్టల్ విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా కళల్లో శిక్షణ ఇచ్చామని బిసి వెల్పేర్ డిపార్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు.
చిన్నారుల్లో దాగిన ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇస్తే అంతరీక్షంలోకైనా వెళ్లతారని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బిసి సంక్షేమ శాఖ మంత్రి ప్రోత్సాహంతో రానున్న ఐదేళ్ల కాలంలో బిసి విద్యార్థులను శాస్రవేత్తలుగా రోదసీ లక్ష్యంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. బిసి విద్యార్థుల నుంచి పదిమందిని ఇస్రోకు, మరో పదిమందిని నాసాకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు.
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడం ద్వారా వారిని అత్యున్నత స్థాయికి చేర్చవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్త, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్ అన్నారు. విశ్వంలోని వింతల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


