కిశోర్ చంద్రదేవ్ మాటల్లో చిత్తశుద్ధి ఎంత?
Published on: Fri Apr 27, 2012 11:40AM
ఆంధ్రప్రదేశ్ కు మంజూరు చేసిన బాక్సైట్ త్రవ్వకాల లైసెన్స్ లను తక్షణం రద్దుచేయాలని, మన్యం ప్రాంతంలో ప్రభుత్వం కనిపించడం లేదంటూ గిరిజన సంక్షేమం, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ కు లేఖ రాయడం పట్ల పలు సామాజిక సంస్థలు, గిరిజన ప్రాంతాల ప్రజలలో హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఇదే సమయంలో మంత్రిగా కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా వుండటం, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా ఎవరో ప్రతిపక్షనేత రాసినట్టుగా రాయడంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కిశోర్ చంద్రదేవ్ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ అక్షరసత్యాలు. బాక్సైట్ కోసం అడవులు ఖాళీ చేయాల్సి వస్తుందని, అడవిలో నివసించే వారంతా ఎక్కడికి వెళతారు.
మన్యం ప్రజలు నక్షల్స్ ను ఆశ్రయించడంలో తపు ఏముంది? అడవులను స్వదేశీయులకు లీజుకు ఇవ్వడమే సమంజసం కాదు, ఏకంగా విదేశీయులకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ చంద్రదేవ్ వ్యాఖ్యానించారు. ఖనిజాల లీజు వ్యవహారంలో కేంద్రం కూడా కీలక పాత్రవహిస్తుంది. కేంద్ర అనుమతి లేకుండా ఖనిజాల వెలికితీత సాధ్యం కాదు. అనుమతులు మంజూరు చేయడంలో మంత్రివర్గం ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటోంది. మంత్రివర్గంలో సభ్యునిగా వుండటం వల్ల, మన్యపుత్రులకు వ్యతిరేకమని భావిస్తున్న అంశాలను మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించవచ్చు, లేదా చట్టసభలోనూ ప్రస్తావించవచ్చు. కానీ ఆ పనులు చేయకుండా ప్రైవేటుగా గవర్నర్ కు లేఖ రాయడంపై ఆయన చిత్తశుద్ధిపై కూడా అనుమానం కలుగుతోంది.


