TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు

Published on: Sun May 3, 2026 2:15PM

 

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో జనని వివాహం జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన నిశ్చితార్థ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు శివాజీ, రచయిత కోన వెంకట్, నిర్మాత సి. కల్యాణ్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు విచ్చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ నిశ్చితార్థ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరినొకరు ఎదురుపడ్డారు. వేడుకకు దాదాపు ఒకే సమయంలో చేరుకున్న వీరు, రాజకీయాలను పక్కనపెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు.

చంద్రబాబు కనిపించగానే ఎర్రబెల్లి దయాకర్ రావు ముందుకు వెళ్లి ఆయనకు నమస్కరించారు. చంద్రబాబు కూడా ఆయన భుజం తట్టి ప్రతినమస్కారం చేశారు. అనంతరం ఇద్దరూ స్వల్పంగా మాట్లాడుకుని తమ తమ దారులు పట్టారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలం టీడీపీలో కొనసాగిన ఆయన, తర్వాత టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు.