ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల ఘాట్ లను కూల్చివేయాలన్న ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అక్భర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది బీజేపీ. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ ఆయన అక్కడకు వెళ్లి నివాళులర్పించారు. అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. ఎన్టీఆర్ కాలిగోటికి ఎంఐఎం పార్టీ సరిపోదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని చెప్పారు బండి సంజయ్. 
       

ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే స్పందించాలని.. ఆయన డిమాండ్ చేశారు. మత విద్వేషాల కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ముఖ్యమంత్రిని నిలదీశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు బండి సంజయ్.