కేసీఆర్ కు భాష తో పాటు దెబ్బలు అప్పగిస్తాం! బండి సంజయ్ సంచలన వార్నింగ్ 

జనగామలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా  ఫ్లెక్సీలు కట్టిన బిజెపి కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు సంజయ్. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ అధికారులు బీజేపీ కార్యకర్తల రక్తం కళ్ల చూస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. జనగామలో బీజేపీ కార్యకర్తల పై జరిగిన లాఠీచార్జి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. 24 గంటల్లో పోలీసులపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని సంజయ్ హెచ్చరించారు. 

 ఫామ్ హౌజ్ లో  పడుకునేందుకు  అధికారం ఇవ్వలేదని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సంజయ్.  నీ కొడుకును కొడితే ఊరుకుంటావా అని సీఎంను  ప్రశ్నించారు. నీ కొడుకు వీపు చితపండు చేస్తే దెబ్బలు పడ్డ కొడుకుల బాధ నీకు తెలుస్తుందంటూ మండిపడ్డారు. ఖబర్దార్ ముఖ్యమంత్రి..  తీరు మార్చుకోకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బండి వార్నింగ్  ఇచ్చారు. తన భాషకు గురువు కేసీఆర్ అన్న బండి సంజయ్..   కేసీఆర్ కు భాష తోపాటు దెబ్బలు కూడ అప్పగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రులు దద్దమ్మలుగా మారారని.. cs, dgp లకే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని విమర్శించారు.  

జనగామలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగాయి. అధికారపార్టీకి వంతపాడుతున్న కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.దీంతో స్థానిక సీఐ, పోలీసులు బీజేపీ నగర అధ్యక్షుడు పవన్ శర్మ, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జ్ కు నిరసనగా బీజేపీ ఆందోళన చేస్తోంది. బుధవారం చలో జనగామకు పిలుపిచ్చారు బండి సంజయ్. దీంతో జనగామలో అదనపు  బలగాలను మోహరిస్తున్నారు.