పార్టీని బలోపేతం చేద్దాం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కె బాలసుబ్రమణ్యంతో చర్చించారు. శుక్రవారం ఢిల్లీలో బాలసుబ్రమణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన సంజయ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ  వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ కావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో దళితులపై పెరిగిన దాడులు, బీజేపీ నేతలు అరెస్టులు, గృహ నిర్భందం మొదలైన అంశాలను సంజయ్ వివరించారు.

దేశ వ్యాప్తంగా ఎదురైన కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లు, లాక్ డౌన్ పరిస్థితుల్లో తెలంగాణాలో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సేవ కార్యక్రమాల గురించి సంజయ్ వివరించారు. రాబోయే రోజుల్లో కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు పార్టీ తెలంగాణ విభాగం అలుపెరగకుండా కృషి చేయాలని బాలసుబ్రమణ్యం సూచించారు.