TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరారీలో బండి బగీరథ్.. ఓ వైపు కోర్టులో విచారణ.. మరో వైపు పోలీసుల గాలింపు

Published on: Fri May 15, 2026 9:35AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణలో రాజకీయంగాను, న్యాయపరంగాను పెను సంచలనం రేపుతోంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ బండి బగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ ను   గురువారం (మే 14) విచారించిన తెలంగాణ హైకోర్టు  తీర్పు శుక్రవారానికి (మే 15)కు వాయిదా వేసింది. 

ఈ కేసు వివరాల్లోకి వెళితే..   మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను భగీరథ్ తరపున కోర్టులో వాదించిన న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి తోసిపుచ్చారు.   రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన వాదించారు.  తమ క్లయింట్ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అయితే ఆ వాదనను ప్రభుత్వం, బాధితురాలి తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. పరారీలో ఉంటూ అరెస్టు నుంచి రక్షణ కోరడం సరికాదని వారు కోర్టుకు తెలిపారు. 

అదలా ఉంటే పరారీలో ఉన్న బండి బగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.  హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్‌లలో ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.  అలాగే బాధితురాలి వయసు నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో బాధితురాలి గుర్తింపును బయటపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.