నిమ్మకూరులో బాలకృష్ణ ప్రత్యేక పూజలు

 

 

 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నిమ్మకూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్నరాత్రి నిమ్మకూరుకు చేరుకున్న బాలయ్య బంధువుల ఇంట్లో బస చేశారు. ఈ రోజు ఉదయం కాలినడకనే గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిమ్మకూరులో ఏర్పాటు చేసి మంచినీటి ప్లాంట్‌ను బాలయ్య ప్రారంభించారు. తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు.చాలా రోజుల తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు పుట్టిన నిమ్మకూరుకు చేరుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు పరిసర ప్రాంతాల నుండి తరలి వచ్చారు. భవిష్యత్‌లో అభిమానుల ఆధ్వర్యంలో ఎన్‌బికె సేవా సంస్థను ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ సంస్థకు చైర్మన్‌గా నేనే ఉంటానని చెప్పిన ఆయన....ఈ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.