బాలయ్య.. కొట్టేది పొగరుతో కాదు!

 

బాలయ్య చెంపదెబ్బల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అంతేకాదు... ప్రతిసారీ ఎవరో ఒకరిపై బాలయ్య చేయి చేసుకోవడం ప్రజల్లోనే కాదు రాజకీయ నేతల్లో కూడా చర్చనీయాంశమే అయ్యింది. కొందరు నెటిజన్లయితే... ఒకడుగు ముందుకేసి... రేపు రాబోతున్న ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ బాలయ్యకు ఇవ్వడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఈ దఫా సీఎం కుమారుడు లోకేష్ నిలబడనున్నట్లు వార్తలు కూడా రాసేశారు. బాలయ్యకు ఈ సారి రాజ్యసభే నట. అప్పుడే జోస్యం కూడా చెప్పేస్తున్నారు. 


ఈ విషయంపై బాలయ్య అంతరంగికులు.. పూర్తి క్లారిటీ ఇచ్చారు. ‘బాలయ్య కొట్టారు.. కొట్టారూ.. అంటారు. అసలు ఎందుకు ఆయన చేయ్ చేసుకోవాల్సొస్తోందో ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం అభిమానుల కోసమే బాలయ్య మార్షల్స్ ని పెట్టుకోరు. అభిమానుల విషయంలో మార్షల్స్ దుకుడుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయ్. అందుకే... వాళ్లను దూరంగా పెడతారు. అంతపెద్ద స్టార్ అయ్యుండి నేరుగా జనాల్లోకి వెళ్లిపోతారు. వారేమో... బాలయ్యను చూడగానే.. అంతులేని ఆనందంతో కిందామీదా చూసుకోకుండా మీద పడిపోతుంటారు.

 

అలాంటి సందర్భాల్లో సహనం నశించి కొడతారే తప్ప.. అదేదో కావాలనో.. పోగరుతోనే కొట్టడం కాదు. హిందూపురంలో ఓ కార్యకర్తను బాలయ్య చేయ్ చేసుకున్న విషయానికే వస్తే.. ఆ కుర్రాడు నేరుగా బాలయ్య గన్ మేన్ మీదే పడ్డాడు. లోడెడ్ గన్ చేతిలో ఉంది. పొరపాటున మిస్ ఫైరింగ్ అయితే.. పరిస్థితి మరోలా ఉండేది. అందుకే.. ఆ కోపంలో ఓ దెబ్బ వేశారు. మరో విషయం ఏంటంటే.. ఆయన గట్టిగా కొట్టరు. ఏదో బెదిరించడానికి అన్నట్లు.. లైట్ గా చరుస్తారు... అంతే. దానికి ఎందుకీ రాద్ధాంతం. బాలయ్యగారి తోటి స్టార్లందరూ మార్షల్స్ తో జనాల మధ్యకొస్తారు. కానీ.. ఒక్క బాలయ్యే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా జనాల్లోకొస్తాడు. అలా రావడానికి గట్స్ ఉండాలి’ అని చెప్పారు.

 

‘సింహా’ చిత్రం ఆడియో వేడుకలో మార్షల్స్ కీ, బాలయ్య అభిమానులకీ మధ్య పెద్ద గొడవే జరిగింది. హైదరాబాద్ రాక్ హైట్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన గొడవను అదుపు చేయడం పోలీసుల వల్లే కాలేదు. అప్పట్నుంచే మార్షల్స్ ని దూరంగా ఉంచడం మొదలుపెట్టాడట బాలయ్య. పాపం.. ఆ వివరాలేం తేలీకుండా... బాలయ్యను టార్గెట్ చేయడం నిజంగా బాధాకరమే. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త సంయమనం పాటిస్తే మంచిది కదా.