ప్రతిపక్షంలో యాక్టివ్ అవుతున్న బాలయ్య
posted on Jun 15, 2019 7:34PM
గడచిన ఎపి అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పరాజయం పాలై శాసన సభలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణుల పై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎం గా అధికారం లో ఉన్న గత ఐదు సంవత్సరాలలో హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికే పరిమితమైన బాలయ్య ప్రస్తుత పరిస్థితులలో తన నియోజకవర్గమైన హిందూపూర్ తో మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. అన్నగా మీకు తోడుగా నేను ఉంటా, గతంలో మాదిరి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం అంటూ తనదైన శైలిలో బాలయ్య కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శాసనసభ లో ఎప్పుడు పెద్దగా స్పందించని అయన తాజాగా గవర్నర్ ప్రసంగం పై స్పందిస్తూ అమరావతి విషయం ఎక్కడా ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. టిడిపి ఓటమి తో కుంగి పోయిన పార్టీ కేడర్ బాలయ్య యాక్టీవ్ అవడంతో కొత్త ఉత్సాహం తో ఉన్నారు.