TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరపైకి జయమ్మ పంచాయితీ...కెలుక్కున్నావేమో జగనన్నా!

Published on: Sun May 24, 2026 5:34PM

 

ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు, హింసాత్మక ప్రవృత్తి, వారి ఫ్యాక్షన్ రాజకీయ విధి విధానాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను ఎంతో మంచివాడ్నని నిరూపించే యత్నంలో భాగంగా తమ ఇంట్లో జరిగిన మూడు మరణాలకు కుట్ర సిద్ధాంతం రుద్ది.. వాటన్నటినీ చంద్రబాబుపై నెట్టడానికి విఫలయత్నం చేసిన జగన్ ప్రస్తుతం చూస్తే తానే ఇరుక్కు పోయారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బీటెక్ రవి వంటి వారు రాజారెడ్డి ఎంతటి ఫ్యాక్షనిస్టో చెప్పడం అటుంచితే.. అసలు వీరు రాజకీయ కుటుంబానికి చెందిన వారే కాదని కుండ బద్ధలు కొట్టారు. వైయస్ ఫ్యామిలీ తొలుత బ్రిటీషర్లకు తొత్తులుగా పని చేసేవారనీ.. వీరిదసలు రాజకీయ కుటుంబమే కాదని అంటారు బీటెక్ రవి. అప్పట్లో ఈ కుటుంబం బ్రిటీషర్లకు వంత పాడ్డంతో.. ఊరి నుంచి తరిమేస్తే పులివెందులకు వలస వచ్చారనీ అంటారు రవి. ఆ రోజుల్లో రాజారెడ్డి భార్య జయమ్మ పంచాయితీ వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ఓడిపోయారనీ.. వార్డుమెంబర్ గా కూడా గెలవడం చేతగాని కుటుంబమనీ ఎద్దేవా చేశారు బీటెక్ రవి.

రాజశేఖర్ రెడ్డి తొలి గెలుపు కూడా నిఖార్సైన గెలుపు కాదనీ.. ఏదో ఫ్లోలో కొట్టుకొచ్చిన గెలుపనీ.. ఆయన గెలిచింది ఒక పార్టీ నుంచి అయితే, కలిసింది మరో పార్టీ అన్న ఆరోపణలున్నాయి. ఇటు రెడ్డి ఓట్లతో పాటు మతపరమైన ఓట్లను కూడా కలుపుకుని గెలిచిన విధం స్పష్టంగా కనిపిస్తుందంటారు కొందరు.. అప్పట్లో వైయస్ నిత్య అసంతృప్త వాదిగా ఉంటూ, ఎన్నో రకాలుగా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టిన గతమని అంటారు కొందరు. వైయస్ అధికారంలో ఉండగా పీవీలాంటి సీనియర్ నేత మరణిస్తే.. పార్టీ పరంగా ఇవ్వాల్సిన గౌరవం కూడా సరిగా నిర్వహించలేదన్న కామెంట్లు కూడా చేస్తారు కొందరు. 

ఇప్పుడిదంతా ఇలా ఉంటే, అనవసరంగా జగన్ ఈ తేనెతుట్టె కదిల్చినట్టు అయ్యిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు వైసీపీ మద్దతుదారులు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గతమంతా తవ్వి పోడం మాత్రమే కాకుండా వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి విదేశీ విధాన వ్యవహారశైలి ఎలాంటిది? అన్న విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. అనవసరంగా జగన్ ఇదంతా కెలుక్కున్నారనీ.. చేజేతులా కొని తెచ్చుకున్నారనీ వాపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనంతటిని బట్టీ చూస్తుంటే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఉడినట్టుగా ఉందన్న మాట కూడా వినిపిస్తోంది.