నేను ఏ సూచన చేసినా బాబు పట్టించుకోలేదు: అవంతి శ్రీనివాస్‌

 

ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అమరావతిపై గొప్పగా చెప్పే నేతలు ఎన్నికల్లో ఆ ప్రాంతంలోని రెండు సీట్లలో ఎందుకు ఓడిపోయారో చెప్పాలి. చంద్రబాబు ఒంటెద్దు పోకడలు పోవడమే టీడీపీ ఓటమికి కారణం. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపిస్తే .. అందుకు విరుద్ధంగా  చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిశారు. రాహుల్‌ను ప్రధాని చేయాలని చూశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని చెప్పిన చంద్రబాబు.. 2019 ఎన్నికల నాటకి బీజేపీని భూస్థాపితం చేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కానీ ప్రజలు తిప్పికొట్టారు. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఏ సూచన చేసినా పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందే టీడీపీకి రాజీనామా చేసి పోటీచేసి గెలిచిన వ్యక్తిని. మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుంది’’ అని అవంతి స్పష్టం చేశారు.