TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏయూ శతాబ్ది వేడుకలు...రూ.500 కోట్ల నిధుల మంజూరు

Published on: Mon Apr 27, 2026 6:53PM

 

స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అడుగులు ఏయూలో  సీఎం చంద్రబాబు...

విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ..

 

విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వర్సిటీ భవిష్యత్తుపై తన దార్శనికతను ఆవిష్కరిస్తూ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వర్సిటీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యాలయాలు కేవలం డిగ్రీ పట్టాలు ఇచ్చే కేంద్రాలుగా మాత్రమే ఉండకూడదని, అవి నూతన ఆవిష్కరణలకు చిరునామాలుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

నగర అభివృద్ధి గురించి మాట్లాడుతూ, విశాఖపట్నం ఇకపై గ్లోబల్ సిటీగా ఎదుగుతుందని, దీనిని ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో రాబోయే అత్యాధునిక గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే వర్సిటీలో రూ.64 కోట్ల పనులను ప్రారంభించామని, ఇది అభివృద్ధికి తొలి అడుగు మాత్రమేనని చెప్పారు.

యువతకు దిశానిర్దేశం చేస్తూ, కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, వందల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. తాను శారీరకంగా 76 ఏళ్ల వయసులో ఉన్నా, తన ఆలోచనలు 26 ఏళ్ల యువకుడిలా ఉంటాయని చెబుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ వేడుకల్లో భాగంగా, వర్సిటీకి పూర్వ విద్యార్థుల నుంచి కూడా మరో రూ.500 కోట్ల నిధులు సేకరించాలని ఆయన ఆకాంక్షించారు. గతం కంటే మెరుగైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువు మాత్రమేనని సీఎం ఉద్ఘాటించారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని మోదీ సహకారంతో 'స్వర్ణాంధ్రప్రదేశ్ 2047' దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ జైత్రయాత్రను ఆంధ్రా యూనివర్సిటీ నుంచే ప్రారంభించడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో ఏయూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందన్న ఆశాభావంతో ప్రభుత్వంతో పాటు విద్యావేత్తలు, విద్యార్థులు కూడా అడుగులు వేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది.