TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘అసహన’ ఉద్యమంపై భిన్నస్వరాలు

Published on: Thu Nov 5, 2015 5:21PM

 

గత కొద్ది రోజులుగా దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు తమకు గతంలో వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ అందించిన అవార్డులను వెక్కి ఇచ్చేస్తున్నారు. దేశంలో మత అసహనం పెరిగిపోవడానికి ప్రస్తుతం అధికారంలో వున్న బిజేపీయే కారణమని చాలామంది ఆరోపిస్తున్నారు. అధికారంలో వున్న బీజేపీ ముస్లింల మీద దాడులకు ప్రోత్సహిస్తోందని వారు అంటున్నారు. ఈ అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న వ్యవహారాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంటే, అధికార బీజేపీ నాయకులు మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ అంశాన్ని లేవనెత్తి ఒక పథకం ప్రకారం  అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారని అంటున్నారు.

ఒక మతం వారి మీద మరొక మతం వారు దాడి చేయడం లాంటి సంఘటనలు దేశంలో అడపా దడపా జరుగుతూనే వున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో గో మాంసానికి సంబంధించిన అంశంలో దాడులు జరిగాయి. అయితే ఆ దాడులను ప్రభుత్వానికి ఆపాదించడం మాత్రం సరైనది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రచయితలు తమకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేయడం అనేది తమను తామే అవమానించుకున్నట్టు అవుతుందని పలువురు అంటున్నారు. బాలీవుడ్‌లో ఒక వర్గం మత అసహనం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే, అంతకు పదింతల మంది ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. సహనం

ఇదిలా వుంటే, సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన 80 మంది రచయితలో ఇప్పటి వరకు 36 మంది మాత్రమే తమ అవార్డులను వెనక్కి ఇచ్చారట. వారిలో 24 మంది మాత్రమే తమకు అందిన నగదు బహుమతిని కూడా వెనక్కి ఇచ్చారట. ఈ వివరాలను సాహిత్య అకాడమీ అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ సాహిత్య అకాడమీ ఎంతో గౌరవంగా ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇవ్వడం భావ్యం కాదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.