TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో ఏషియన్ పెయింట్స్ నిర్మాణ కార్యక్రమాలు త్వరలో

Published on: Sat Dec 20, 2014 1:46PM

 

రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు జరిగాయి. అనేక సంస్థలకు ప్రభుత్వం అనుమతులు, భూ కేటాయింపులు చేస్తోంది. ఆ ప్రక్రియలన్నీ ఒకటొకటిగా పూర్తవుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ముందుగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద పూడి అనే గ్రామంలో రూ.1818కోట్ల పెట్టుబడితో భారతదేశంలో ఎంతో పేరుగాంచిన ఏషియన్ పెయింట్స్ సంస్థ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.సి.సి.) ఏషియన్ పెయింట్స్ సంస్థ కోసం పూడి గ్రామం వద్ద 110 ఎకరాలను కేటాయించింది. త్వరలో ఆ భూమిని ఏషియన్ పెయింట్స్ సంస్థకు అప్పగించబోతున్నారు. వచ్చే నెల నుండి నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరి కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. కనుక భూమి అప్పగించిన వెంటనే రేయింబవళ్ళు నిర్మాణ కార్యక్రమాలు చేసేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.

 

ఆ సంస్థ తన ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా 700మందికి, పరోక్షంగా మరనేక వేల మందికి ఉపాధి లభించవచ్చును. అక్కడ రోజుకి నాలుగు లక్షల పెయింట్ ఉత్పత్తి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే అచ్యుతాపురం ప్రాంతంలో అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలు, బ్రాండిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ సంస్థ కూడా వచ్చినట్లయితే ఆ చుట్టూ పక్కల అభివృద్ధి వేగవంతం అవుతుంది. దీని వలన అనేకమందికి ఉపాధి దొరకడమే కాకుండా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుంది.

 

ఈ సంస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడితో చిత్తూరులో శ్రీ సిటీ వద్ద త్వరలో హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థ కూడా రాబోతోంది. హీరో మోటోకార్ప్ సంస్థ కూడా వచ్చే ఏడాది చివరిలోగా నిర్మాణం పూర్తి చేసుకొని 2016 నుండి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది.