TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆరోపణల తుఫాన్… కేసుల పిడుగుల్లో… కేజ్రీవాల్!

Published on: Mon May 22, 2017 2:41PM

 

కేసులు, ఆరోపణలు, విమర్శలు, ఓటములు … ఇవన్నీ ఎలా వుంటాయో అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పుడు అర్థమవుతోంది. ఒకప్పుడు అన్నా హజారే టీమ్ నుంచి పక్కకు తప్పుకుని రాజకీయ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ తిరుగులేని క్రేజ్ ఎంజాయ్ చేశాడు. ముఖేష్ అంబానీ మొదలు షీలా దీక్షిత్ వరకూ అందర్నీ ఏకి పారేశాడు! ఏకే గురి పెట్టాడంటే ఏకే 47 గన్నుకి భయపడ్డట్టు భయపడేవారు! కాని, ఇప్పుడు గ్రహాలు దిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గిర్రున తిరుగుతున్నాయి…

 

రోజుకో వివాదంలో ఇరుక్కునే అరవింద్ అత్యంత తాజాగా సతమతం అవుతోన్న సమస్య కపిల్ మిశ్రా కామెంట్స్! ఏ క్షణం అయితే అతడ్ని కేజ్రీ బయటకు పంపాడో అమాంతం ఆరోపణల వర్షం మొదలు పెట్టాడు. ఆ తుఫాన్ ఇంకా ఆగటం లేదు. అవినీతి పరుల గుండెల్లో నిద్దుర పోతా అన్న అరవింద్ ను నిద్రపోనీయకుండా చేస్తున్నాడు మిశ్రా… తన అవినీతి ఆరోపణలతో! అవ్వి ఎంత వరకూ నిజం అన్నది భవిష్యత్ లో తేలాల్సిందే. అసలు తేలకపోవచ్చు కూడా. కాని, ఇప్పటికిప్పుడు అయితే పెద్ద తలనొప్పిగా మారాయి దిల్లీ సీఎంకి!

 

కపిల్ మిశ్రా ఆరోపణల్ని ఖండించినా ఖండించకపోయినా ఇబ్బందే అన్నట్టున్న కేజ్రీవాల్ పరిస్థితి తాజాగా మరింత రచ్చై కూర్చుంది. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు నిజమైతే తాను ఈపాటికి జైల్లో వుండేవాడినని ఆప్ అధినేత అన్నాడు. దానికి కౌంటర్ ఇచ్చిన మిశ్రా జైలుకి వెళ్లని వారంతా అవినీతి పరులు కానట్లేనా అంటూ 2జీ, కామన్ వెల్త్ కుంభకోణం లాంటి అనేక కేసుల్ని, ఆరోపణలు ఎదుర్కుంటున్న నాయకుల్ని ఏకరువు పెట్టాడు!

 

ఒకవైపు కపిల్ మిశ్రా లాంటి జూనియర్, అరవింద్ ను ఆటాడుకుంటూ వుంటే మరో వైపు జైట్లీ లాంటి సీనియర్ నాయకుడు కూడా వదలటం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్ మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చిన జైట్లీ ఆ కేసులో భాగంగా మరో పరువు నష్టం కేసు వేశాడు. అందుక్కారణం కేజ్రీవాల్ కోరి పెట్టుకున్న లాయరే! ప్రముఖ న్యాయవాది జెఠ్మలానీ కోర్టులో జైట్లీని క్రూక్ అన్నాడు. అలా తనని మోసగాడు అనటం తీవ్రంగా పరిగణించిన జైట్లీ ఆ మాట జెఠ్మలానీ అన్నాడా? లేక కేజ్రీవాల్ అనమంటే అన్నాడా అని ప్రశ్నించాడు! రామ్ జెఠ్మలానీ అరవింద్ కేజ్రీవాల్ సూచన మేరకే తాను క్రూక్ అనే పదం వాడనని సెలవిచ్చాడు. ఈ పాయింట్ ఆధారంగా జైట్లీ రెండో పరువు నష్టం కేసు వేశాడు కేజ్రీవాల్ పైన!

 

జెఠ్మలానీ వల్ల తాను కేసు నుంచి బయటపడతాను అనుకున్న కేజ్రీవాల్ కి బోనస్ గా రెండో డిఫమేషన్ కేసు వచ్చి చేరింది. పాపం బ్యాడ్ టైంలో వున్న సీఎంగారికి… వర్షం పడుతోందని చెట్టు కిందకి పోతే … కొమ్మలు మీద పడ్డాయి!