కేజ్రీవాల్‌ పదవి ఉండేనా..వూడేనా..?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఈ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత శుక్రవారం రాష్ట్రపతికి సిఫారసు చేసింది. దీనిని పరిశీలించిన ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంతో అనర్హత వేటు పడిన 20 మంది ఎమ్మెల్యేల స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 66 మంది సభ్యుల బలం ఉంది. 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినప్పటికీ.. మేజిక్ ఫిగర్ 35 అయితే ఆప్‌కు ఇంకా 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మళ్లీ ఎన్నికలు జరిగి పరిస్థితులు అటు ఇటు జరిగితే కేజ్రీవాల్ ప్రభుత్వానికి అగ్నిపరీక్షేనని విశ్లేషకులు అంటున్నారు.